భరణీ వారి సరికొత్త చిత్రం 'బాటసారి' అనేక విధాల విశేషంగా, ప్రశంసనీయంగా ఉంది. ఫలితం మాట అటుంచి, అసలు ఒక తెలుగు దర్శక నిర్మాత, ఇప్పటి పరిస్థితులలో, ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించకుండా, చిత్తశుద్ధితో ఇటువంటి విషాదాంత చిత్ర నిర్మాణానికి పూనుకోవడమే విశేషం. ఈ చిత్రంలో ఇంకా ముఖ్యంగా విశిష్టత ఇతివృత్తంలోనే ఉంది. ఈ ఇతివృతం తెలుగు వెండి తెరకు సరికొత్తది. 'బాటసారి' నిర్మాణం దక్షిణాది ఫిలిం రంగంలో పెద్ద సాహసకృత్యం.
టాగోర్ శతజయంత్యుత్సవాల సందర్భంగా ఫిలింస్ డివిజన్ తరపున సత్యజిత్ రాయ్ నిర్మించిన 'రవీంధ్రనాథ్ టాగోర్' డాక్యుమెంటరీ చిత్రం దేశవ్యాప్తంగా విడుదల అయింది. వివిధ ప్రాంతీయ భాషలలో దీనికి వ్యాఖ్యానం కూడా జోడించారు. ఇంగ్లీషులో దీనికి సత్యజిత్ రాయ్ స్వయంగా వ్యాఖ్యానం రచించారు. ఆయనే వ్యాఖ్యానాన్ని చదివారు కూడా.
'ఇల్లరికం' (రజతోత్సవ) చిత్రాన్ని నిర్మించి ఆంధ్రపేక్షకుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న ప్రసాద్ ఆర్ట్ పిక్చర్సువారు అంతకంటే మరొక మెట్టు ఉన్నతస్థాయిలో భార్యాభర్తలు చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చలన చిత్రాభిమానుల అభిరుచులకు అనుగుణంగా అన్ని హంగులను ఏర్పికూర్చి, అధిక వ్యయప్రయాసల కోర్చి వారు ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారు.
పర్బత్ ఫిలింస్ వారి 'ఏక్ ఫూల్ చార్ కాంటే' చిత్రం కాలక్షేపానికి బఠాణీ వంటిది. 14 వేలపై చిల్లర అడుగులపాటు ప్రేక్షకులను నవ్వించడమే ఈ చిత్రం పరమార్థం. మోతాదు మించిన హాస్యంతో ప్రేక్షకుల పొట్టలను చెక్కలు చేసే దురుద్దేశం ఈ చిత్రానికి లేదు. లాలిత్యం, మాధుర్యం మొదలయినవి ఈ హాస్యంలో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇందులో వహీదారెహమాన్ ఉంది. అందుకే ఒకసారి చూసిన వారికి మరొకసారి చూడాలనిపిస్తుంది ఈ చిత్రం. ఇందులో అసంతృప్తి కలిగించే అంశాలలో సంగీతం ఒకటి. చాలా మంది ఆశించేటంత బ్రహ్మాండంగాలేదు శంకర్ జై కిషన్ సంగీతం.
ఇన్నాళ్ళకు తెలుగులో సంతృప్తికరమైన డబ్బింగు చిత్రం ఒక్కటి వచ్చింది. బలంగల కథతో, జవంగల కథనంతో, గతి తప్పని నడకతో, పదునైన మాటలతో 'తల్లిఇచ్చిన ఆజ్ఞ' సంతృప్తికరమైన చిత్రంగా రూపొందింది. దృశ్యం, శ్రవ్యం ఈమధ్య ఏ డబ్బింగు చిత్రంలోనూ కని విని ఎరగనంత చక్కగా సమన్వయించాయి. సహజంగానే కథ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోగలది కావడం వల్ల, దానికి అద్భుతమైన రచన తోడై చాలా సందర్భాలలో ఇది డబ్బింగు చిత్రమన్న విషయాన్ని మరపింపచేస్తుంది.
బోలెడు కాలం. ధనం, ఓపిక వెచ్చించి భారీ ఎత్తున వ్యాపార సరళిలో నిర్మించిన బొంబాయి వాళీ ఉత్తమ చిత్రం 'జిస్ దేశ్ మే గంగా బహతీ హై'. లోగడ రాజ్ కపూర్ నిర్మించిన చిత్రాల కోవకు చెందినదే అయినా వాటికంటే ఈ చిత్రం మరింత భారీ ఎత్తున, ఇంకా ఆకర్షణీయంగా నిర్మించబడింది. ఆ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు ఈ చిత్రం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. ప్రబోధాత్మక చిత్రమనీ, వాస్తవికత ఉట్టిపడేటట్లు చిత్రీకరించారనీ ఇంతకాలం ఈ చిత్రాన్ని గురించి జరిగిన ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకోకుండా చూస్తే మూడుగంటల కాలక్షేపానికేమీ కొదవ ఉండదు.
అసలే తెలుగు చిత్రం, అందులోను డబ్బింగ్ చిత్రం. ఆ పైన జానపద వంటి చరిత్రాత్మక చిత్రం-ఎలా ఉంటుందో ఊహించడం అంత కష్టం కాదు. అందుకే మరీ అమాయకులకు తప్ప ఎవరికీ ఆశాభంగం కలగదు. అధవా కలిగినా అది నిర్మాతల తప్పుకాదు. తమ తప్పేనని ఒప్పుకొని లెంపలు వేసుకుంటారు. "ఔరా! ఈ చిత్రం ఎంత గొప్పగుణపాఠం (దురాశ దుఃఖము చేటు) నేర్పింది!" అని ముక్కుల మీద వేళ్ళు వేసుకుంటారు.
లోగడ ఫిల్మిస్తాన్ సంస్థ పేరిట, దరిమిలా ఫిల్మాలయా (స్వంత) సంస్థ పేరిట ఎస్.ముఖర్జీ నిర్మించిన, నిర్మిస్తున్న చిత్రాలన్నీ కాలక్షేపానికి నిక్షేపాలనతగ్గవి. విజ్ఞానం పాలు కొరవడినా వినోదం పాలు ఆయన చిత్రాలలో పుష్కలంగా లభిస్తుంది. విశ్రాంతికోసం, వినోదంకోసం తపించే జనానికి మత్తుచల్లి, సేద తీర్చడమే పరమాశయంగా ఆయన చిత్రాలు నిర్మిస్తున్నాడు. ఫిల్మాలయా పేరిట తాజాగా వెలువడిన ఈస్ట్ మన్ కలర్ చిత్రం 'హమ్ హిందూస్తానీ' కూడా ఆ కోవకే చెందుతుంది.
మెజారిటీ హిందీ చిత్రాలపై మోజుగల వారికి, రాజకపూర్ నటించిన చిత్రం కదా అని కొండంత ఆశపెట్టుకొనే వారికి 'శ్రీమాన్ సత్యవాది' చిత్రం ఆశాభంగం కలిగించదనే చెప్పవచ్చును. సర్వసాధారణంగా హిందీ చిత్రాలలో ఉంటున్న సుగుణాలు, దుర్గుణాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఆ గుణాలు-మంచి సంగీతం, అంతకు మించిన ఛాయాగ్రహణం, మించని అభినయం, చౌకబారుకథ, కారు చౌకనృత్యాలు, అదేస్థాయి దర్శకత్వం. వీటిని దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈ చిత్రం ఆశాభంగం కలిగించదు.
అపరాధ పరిశోధక చిత్రాలపట్ల ప్రత్యేకాభిమానం గలవారికి, శక్తి సామంత చిత్రాలను ఇది వరకు విరివిగా చూసిన వారికి 'జాలీనోట్' చిత్రం ఆశాభంగం కలిగించకపోవచ్చును. అపరాధ పరిశోధన తన అభిమానశాఖగా గ్రహించి శక్తిసామంత శక్తి వంచన లేకుండా కృషిసలుపుతున్నారు. ఈ శాఖలో ఆయన చెప్పుకోదగ్గ ప్రావీణ్యం సంపాదించారు. ఆయన చిత్రాలపై ప్రజలకు ఇటీవల విపరీతంగా మోజు పెరిగింది. ఈమధ్య ఆయన తీసిన చిత్రాలన్నీ విశేషంగా డబ్బు చేసుకున్నాయి.