డాక్యుమెంటరీ సంవిధానాన్ని సంకేతాల (సింబల్స్)తో, ధ్వనుల (సజెషన్స్)తో, కళావిలువలతో మేళవించి, ఒకానొక వినూత్నమైన, విలక్షణమైన సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన శకపురుషుడు సత్యజిత్ రాయ్. చలనచిత్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆయనతో ఆరంభమయింది. వాస్తవిక దృక్పథం, సాంకేతిక (సింబాలిక్) దృక్పథం, కళాదృక్పథం ఆయన చిత్రాలలోని ప్రత్యేక లక్షణాలు, ఆయన చిత్రాలు మానవ జీవితమంతటి నిగూఢమైనవి, అగాధమైనవి-ఎవరికి ఎంత సంస్కారం వుంటుందో వారికి ఆయన చిత్రాలు అంత గొప్పగా వుంటాయి - కళా కైవల్యానికి స్వర్ణసోపానాలు ఆయన చిత్రాలు.
గత జూలై నెలలో జరిగిన శాన్ సెబాస్టియన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించేనిమిత్తం రాష్ట్రపతి రజతపతకాన్ని పొందిన శంభూఫిలింస్ వారి 'నమ్మినబంటు' చిత్రాన్ని స్పెయిన్ కు పంపేముందుగా, భారత ప్రభుత్వపు విదేశాంగ వ్యవహారాల శాఖవారు చిత్రంనిడివిని 18 వేల అడుగులనుంచి 9 వేల అడుగులకు కుదించారు. ఈ సంక్షిప్తప్రతిని క్రిందటి మంగళవారం నాడు నవయుగ ఫిలింస్ వారు విజయవాడలోని అలంకార్ థియేటర్ లో ప్రతికలవారికి ప్రత్యేకంగా చూపించారు.
కళా పిపాస గల మానవునికి ప్రకృతిలోని ప్రతిదృశ్యమూ సౌందర్యమయంగా, ప్రతి శబ్దమూ సంగీతమయంగా గోచరిస్తుంది. పక్షుల కిలకిలా రవాలు, ఆలమందల అంబారవాలు, జలపాతాల గంభీరనాదాలు, సెలయేళ్ల నీళ్ళ చిరుసవ్వళ్ళు, పడుచుపిల్లల కాలియందెల చప్పుళ్ళు అతన్ని పరవశింపచేస్తాయి. చుంయ్ చుంయ్మని పితికేపాలల్లో, రంయ్ రంయ్ మని వడికే రాటంలో, రోకటిపోటులో, రంపపు కోతలో, సమ్మెట దెబ్బలో అద్భుత 'లయ' విన్యాసాన్ని దర్శించి ముగ్ధుడవుతాడు. 'లయ' అతన్ని పురిగొల్పుతుంది. వార్షుక మేఘాన్ని గాంచిన నెమలిలా వెర్రి ఆనందంలో పరవశించి నర్తిస్తాడు.
స్వచ్ఛమైన, ఆదర్శవంతమైన లలితసంగీతం అంటే ఏమిటో, నేపథ్య సంగీతం ఎలా వుండాలో నేర్చుకోవలసి వున్న మన సంగీత దర్శకులంతా తప్పక పదేసి సార్లు చూడదగ్గ చిత్రం 'అనూరాధ'. కేవలం కథా ప్రధానం కాకుండా, ఒకే ఒక సెంటిమెంటును తీసుకొని దాన్ని సినిమాగా మలచటం ఎలాగో తెలుసుకోవాలంటే మనదర్శకులు కూడా ఈ చిత్రాన్ని చూడడం చాలా అవసరం.
ఒక నీగ్రోనీ, ఒక శ్వేతజాతి యువకుణ్ణీ ఒకే గొలుసుకు బంధించి పోలీసులు తీసుకుపోతూ వుంటారు. నీగ్రో, శ్వేతజాతులమధ్య తరాల తరబడి రగులుతున్న పరస్పర భీషణద్వేషాగ్ని వారిరువురిలో రేగుతున్నది. ఇద్దరినీ ఒకే గొలుసుకు బంధించి నందుకు అసహ్యం, నిస్సహాయత, ఒకరి నొకరు కోపంతో కొరకొర చూసుకుంటూ వుంటారు - పోలీసు కారు కొండదారి వెంట సాగిపోతూంది. నీగ్రో యువకుడు నిర్లక్ష్యంగా, కర్ణకఠోరంగా గీతం ఆలపిస్తూ వుంటాడు. కారులోని వారందరికీ జుగుప్స రేగుతుంది. శ్వేతజాతి యువకుడు కయ్యానికి కాలుదువ్వుతాడు. నీగ్రోయువకుడు తలబడతాడు. ఫలితంగా పోలీసు లారీ బాట పక్కన అగాధంలోనికి దొరలిపోతుంది. పలువురు మృతిచెందుతారు. యువకులిద్దరూ క్షేమంగా బ్రతుకుతారు. తప్పించుకుని పారిపోవటం యిద్దరికీ అవసరమే.
నిర్మాతలు : పి. సూరిబాబు, కె. నాగుమణి; దర్శకుడు : కె. కామేశ్వరరావు; కథ, మాటలు-పాటలు : పింగళి నాగేంద్రరావు; సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు; నృత్యం : పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి సత్యం; కళ : గోఖలే; నేపధ్యగానం : ఘంటసాల, మాధవపెద్ది, పి. లీల, సుశీల, జిక్కి, జయలక్ష్మి, రాణి; నటీనటులు : నాగేశ్వరరావు, యస్.వి. రంగారావు, రేలంగి, సి.యస్.ఆర్, లింగమూర్తి, సూరిబాబు, కె.వి.యస్. శర్మ, వంగర, శ్రీరంజని, రాజసులోచన.
ఆధునిక ధర్మ ప్రచండ వాయుధాటికి సనాతన ధర్మ మహావృక్షం కూకటి వ్రేళ్ళతో ప్రెల్లగిలి కూలకమానదు. క్షణక్షణం పరిణతి చెందడం ప్రకృతి ధర్మం. రాజ్యాలూ, మతాలూ, ధర్మాలూ, సంప్రదాయాలూ అన్నీ కాలప్రవాహపు వడిలో కొట్టుకొనిపోయే గడ్డిపరకలు. నిత్యనూతన స్వభావం ఒకటే సుస్ధిర సత్యం. ఈ సత్యానికి తలవంచక ధిక్కరించాలనుకోవటం భగవంతునితో కుస్తీ పట్టాలనుకోవటమే అవుతుంది. లొంగకపోతే మెడపట్టి లొంగదీస్తుంది కాల ధర్మం. ఇదే 'నిత్యకళ్యాణం పచ్చతోరణం'లోని మూలవస్తువు.
వసంతోత్సవ వినోదాలలో నిమగ్నులై ఉండగా మహారాజును దుండగులెవరో హత్య చేశారు. గురుకులంలో విద్యా భ్యాసం ముగించి రాజధానికి తిరిగి రానున్న యువరాజుకు ఈ విషయం తెలిసింది. ఆ రాత్రే యువరాజుపై కూడా హత్యా ప్రయత్నం జరిగింది. దుండగులను పరిమార్చి రాజధానికి తిరిగి వస్తూ దారిలో స్పృహతప్పి పడిపోతాడు. ప్రమీల అనే అందమైన అమ్మాయి బండి మీద పాటపాడుకుంటూ వచ్చి యువరాజును చూసి ప్రేమించి సేదతీర్చుతుంది. బండిలో రాజధానికి చేరవేస్తుంది. రాకుమారుడు తనకు నా అన్న వాళ్లెవరూ లేరనీ పరదేశిననీ ఆమెతో చెప్తాడు.
విజ్ఞానం మాట ఎలా ఉన్నా, చిత్రం చూసిన కాసేపూ పుష్కలంగా వినోదం లభిస్తే, మనస్సులోని అశాంతిని దులిపేసి నిర్మలంగా ఉంచగలిగితే, తాత్కాలికంగానైనా వేసవికాలంలో కూల్ డ్రింక్ తాగినంత హాయిగా ఉంచగలిగితే, ఆ చిత్రం సినిమాల ఆదర్శంలో సగం సాధించినట్లే. డబ్బులు పెట్టుకుని చూసిన వాళ్ళు విసుక్కోరు. పండితులూ తిట్టరు. విజ్ఞానం లేకపోగా, సినిమా చూస్తున్నంత సేపూ సస్పెన్సుతో హై రానపడి, ఇంటికి వచ్చిన తరువాత బఫూను వెకిలిచేష్టలూ, పిస్తోలు పుచ్చుకుని బెదిరించే గగ్గుల మొహం విలనూ సస్పెన్సు మ్వూజిక్కు కలలోకి వచ్చాయంటే ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తుంది.
జవం గల కథ, జీవం గల పాత్రలు, నిర్దుష్టమైన సన్నివేశాల చిత్రీకరణతో సగటు తెలుగు సాంఘిక చిత్రాల అవధిని అధిగమించింది సారథి స్టూడియోస్ వారి 'కులదైవం'. భారతీయ ఉమ్మడి కుటుంబాలలో సహజమైన ఆనందం, విషాదం, ఉల్లాసం, కల్లోలం, అనురాగం, అసూయ, ఆప్యాయత, అపోహ, పశ్చాత్తాపం సమపాళలో మేళవించుకుని, భారత సంప్రదాయమంత నిండుగా, నిరాడంబరంగా ఉంది. 'కులదైవం'. 16 వేల పైచిలుకు నిడివిలో ఒక్క అడుగైనా ప్రేక్షకులకు విసుగు పుట్టించకుండా, అడుగడుగునా సానుభూతిని చూరగొన్నది.